
ఆడబిడ్డలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండ..ఆర్డీఓ కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ
ఆర్డీఓ కార్యాలయ, తహశీల్దార్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట్ లోకల్ టైమ్స్ ప్రతినిధి: ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకోవడంకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం సాయంత్రం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రతి ఆడబిడ్డకు 18 ఎళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. గ్రామాలలో నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు కల్యాణ లక్ష్మి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, షాదీ ముబారక్ కింద మైనార్టీల యువతుల వివాహాలకోసం లక్షా 116 వేల రూపాయలు అందజేస్తుందన్నారు. దేశంలోనే గతంలో కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి కార్యక్రమాలను చేయలేదని, కేవలం కేసీఆర్ సర్కార్ మాత్రమే అమలు చేసిందని అన్నారు. కాగా సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని అర్హులైన 74 మందికి రూ.74లక్షల 8 వేల 584 రూపాయల మేర చెక్కులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ మేరకు నియోజకవర్గ పరిధిలోని సుమారు 2 వేల మంది అర్హులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు రావాల్సి ఉన్నదని జాప్యం ఎందుకు జరుగుతున్నదని ఆర్డీఓ కార్యాలయ, తహశీల్దార్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మండలాల వారీగా కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ సంక్షేమం కింద మంజూరైనప్పటికి లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి ఇంకెంత కాలం సమయం కావాలని సుతి మెత్తగా అధికారులను మందలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
