వీధికుక్కల దాడిలో ఆవు దూడ దారుణ మృతి

లోకల్ టైమ్స్ విశాఖపట్నం; యలమంచిలి పట్టణంలో కొత్తపేట లో గల సంబర సోమేశ్వర శర్మ అనే వ్యక్తి ఇంట్లో వీధి కుక్కల దాడిలో ఆవు దూడ మృతి చెందింది.నాలుగు అడుగుల ఇంటి ప్రహరీ గోడదాటి లోపలికి వీధి కుక్కలు రావడం గమనార్హం.యలమంచిలి మున్సిపల్ అధికారులు,కార్మికుల నిర్లక్ష్యానికి ఉదాహరణగా దీన్ని చెప్పుకోవచ్చు. గత కొద్ది నెలల క్రితం మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్ల పదవీకాలం ముగియడంతో పదవీ విరమణ చేశారు. అనంతరం పట్టణంలో పారిశుధ్యం, ప్రణాళిక కొరవడిందని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ప్రధానంగా వీధికుక్కల, పందుల సమస్య, రహదారులు వీటిపై శ్రద్ధ చూపేవారు కరువయ్యారు. పిల్లలపై దాడిచేయడం, వాహనాలపై వెళ్లే వారిపై దూకడం వంటి వాటితో పట్టణ ప్రజలు రాత్రులే కాదు పగలు కూడా నడవడానికి భయపడుతున్నారు. ప్రధానంగా రాంనగర్, కొత్తపేట,గాంధీనగర్, రైల్వేస్టేషన్ రోడ్, ఏ. ఎస్.ఆర్.కాలనీ, యానాద్రి కాలనీ,ఫైర్ ఆఫీసు కాలనీ మరియు పట్టణ శివారు ప్రాంతాల్లో ఈ సమస్య చాలా అధికంగా ఉంది.ఇప్పటికైనా అధికారులు తగుచర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు పత్రికా ముఖంగా కోరుతున్నారు.
