కలికిరి, మే 13; ప్రధాని 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం ఉంటుందని అస్పష్టంగా చెప్పడం చూస్తే మరోసారి ప్రజలను మోసం చేస్తున్నాడని సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు బుధవారం ఒక ప్రకటన లో విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వావలంబన భారత్ అన్న నినాదం ఇస్తూ ఆర్థిక సంస్కరణలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రకటించారు. ఈ ఆర్థిక సంస్కరణలే స్వావలంబన ను దారుణంగా దెబ్బ తీశాయి. ఇంకా తీస్తున్నాయి. మరి మన స్వావలంబన భారత్ నినాదం సంస్కరణలు వేగవంతం చేయడం అనేది సాధ్యం కాదు. స్వదేశీ, లోకల్ మార్కెట్ బలోపేతం వంటి మాటలు కూడా చెప్పారు. అయితే లోకల్ మార్కెట్ ఆర్థిక సంస్కరణల కారణంగానే దెబ్బతిన్నది. ఇలాంటివి ప్రజలకు చెప్పకుండా రాజకీయ లబ్ధి కోసం ఉపన్యాసం ఇచ్చి అస్పష్టంగా ముగించడం చూస్తే మరోసారి ప్రజాస్వామ్యంపై దాడి స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా స్పష్టంగా కరోనా నివారణలో భాగంగా శాస్త్రీయమైన పద్ధతి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతంలో కలికిరి, వాల్మీకిపురం, మదనపల్లి, ములకలచెరువు, రామసముద్రం ఇలాంటి మండలాల్లో కరోనా విస్తరిస్తున్నది. ఇప్పటికే ఈ ప్రాంతం కరవుతో విలయతాండవం చేస్తున్నది. ఇలాంటి సందర్భంలో కరోనా వచ్చి ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తున్నది. లాక్ డౌన్ వలన వ్యవసాయం కుదేలైంది .టమోటా రైతులు ఇతర పండ్ల తోటల రైతులు భారీ స్థాయిలో నష్టపోయారు. పొలాల్లోనే వదిలేసిన పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. రైతులకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై పోయిన పరిస్థితి ఉంది .సరైన ఆహారం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి సందర్భంలో కరోనా వైరస్ విస్తరించడంతో ప్రజలకు ఏమి చేయాలో తోచక అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో ఈ ప్రాంత ప్రజానీకంను ఆదుకోవడానికి జిల్లా యంత్రాంగం ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని సిఐటియు కోరుతున్నది. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా వుంటూ కరోనా వైరస్ నివారణకు సరైన జాగ్రత్తలు పద్ధతులు పాటించాలని పిలుపునిచ్చారు. బౌతిక దూరం పాటిస్తూ పౌష్టికాహారం తీసుకుంటూ మాస్కులు లాంటి పరికరాలు ఉపయోగిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం కూడా రక్షణ పరికరాలు ప్రజలందరికీ అందించాలని డిమాండ్ చేశారు. అనేక గ్రామాల్లో త్రాగు నీరు లేక అల్లాడుతున్నారు. అధికార యంత్రాంగం తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకి సేవ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కి ఆరోగ్య కార్యకర్తలకు ఇతర సిబ్బందికి రక్షణ సౌకర్యాలు కల్పించడంతోపాటు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పై సమస్యలపై 14వ తేదీ జరిగే ఆందోళన కార్యక్రమాల్లో అంగన్వాడి, ఆశ, వి.ఓ.ఏ, పంచాయతీ అన్ని రకాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చాడు.





























